Blogger Template by Blogcrowds.

Thursday, September 6, 2007

ముఖరితమైన ముఖారి

ముఖారి రాగం శోకానికీ విషాదానికీ చిహ్నం అంటూ ఉంటారు. నవరసాల్లో శోకం లేదు. దానికి దగ్గరగా వచ్చేవి భీభత్సం, కరుణ. అసలు ఒక రాగం వింటే ఒక రసం, ఒక mood ఉత్పన్నమౌతుంది అనే సిద్ధాంతం నాకు నచ్చదు. ఇలా రాగానికీ రసానికీ ముడి పెట్టే తిక్క హిందుస్తానీ వాళ్ళకి మరీ ఎక్కువ.

ఏ రాగమైనా ఏ మూడ్‌లోనైనా పాడవచ్చని నా అభిప్రాయం. సాహిత్యాన్ని బట్టీ, పాడే పద్ధతిని బట్టీ కొంతవరకూ మూడ్ ఏర్పడుతుంది. సామజవరగమనా అని ఎంతో గంభీరంగా ఉన్నట్టుండే హిందోళం మనసులోని మర్మమును దెలుసుకో అంటూ దీనంగా వేడుకుంటుంది, లేకపోతే ఇళయరాజా ఇంద్రజాలంతో అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయె అంటూ కడలి తరగలై నాట్యం చేస్తుంది.

పూర్వకాలం మనదేశంలో వీధినాటకం, యక్షగానం లాంటి కళారూపాలుండేవి. కొద్ది తేడాతో ఇలాంటివే కర్ణాటకలోనూ తమిళనాడులో కూడా ఉన్నాయి. ఈ కాలపు నృత్య నాటకాలకి మూలమైన కళలివి. వీటిల్లో సంగీతమూ నాట్యమూ ఉన్నా, కథకే ప్రాముఖ్యత. ఉదాహరణకి రామాయణ కథని ఆడుతున్నారనుకోండి - రాముడు అయోధ్య వదిలి అడివికి వెళ్ళినప్పుడు, సీత జాడ తెలియక రాముడు అల్లాడినప్పుడు, ఆశోకవనంలో సీత దుఃఖిస్తున్నప్పుడు - ఇలా విషాదమైన ఘట్టం వచ్చినప్పుడల్లా ముఖారి రాగమే వాడగా వాడగా, జనాల మనసులో ముఖారి అంటే విషాదం, శోకం అనే భావన వచ్చేసి ఉంటుంది. మన హీరోలకి ఇమేజ్ లాగా కొన్ని కొన్ని రాగాలకి కూడా ఇలా ఇమేజ్ ఏర్పడిందని నా అనుమానం.

లేకపోతే ముఖారి రాగం విషాదమేవిటి నా మొహం! ఈ రాగంలో చాలా మందికి తెలిసినది అన్నమయ్య కీర్తన "బ్రహ్మ కడిగిన పాదము". ఎవరు ఎప్పుడు స్వరపరిచారో తెలీదుగానీ ముఖారి రాగంలో ఇప్పుడూ మనం వింటున్న బాణీలో ఎప్పణ్ణించోనే వినబడుతూ ఉంది. ఘంటసాల, బాలమురళీ, ఎమ్మెస్ సుబ్బులక్ష్మిదాకా అందరూ పాడారు. ఎవరు పాడినది విన్నా ఒక పరమాద్భుతమైన దివ్యదృశ్యాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుందే గాని విషాదమన్నది ఏ కోశానా కనబడదు.

ముఖారిలో ఇంకొన్ని ప్రఖ్యాత కృతులు
శివకామ సుందరీ
ఎంతని నే వర్ణింతును శబరీ భాగ్యము

తలచినంతనే నా తనువైతే

సంగీత శాస్త్ర జ్ఞానము

క్షీణమై తిరుగ

సరసీరుహానన రామ

ఇందుకా ఈ తనువు పెంచినది

ఎంతని నే వర్ణింతును శబరీ భాగ్యము

ఏల అవతారమెత్తుకొంటివో

కారుబారు సేయువారు గలరే

ఏకామ్రనాథాయ నమస్తే

కృష్ణం కలయసఖి సుందరం

మహామహోపాధ్యాయ నూకల చినసత్యనారాయణ గారు కూడా తమ రాగాల పుస్తకంలో ఈ రాగం మనోధర్మ సంగీతానికి మంచి అవకాశం ఇస్తుందని సెలవిచ్చారు. క్షీణమై తిరుగ జనించే అనే త్యాగరాజ కీర్తన పాడేందుకు సెమ్మంగూడి శ్రీనివాసయ్యరు పెట్టింది పేరు. ఇంకా అనేక ఇతర కచేరీలలో వేర్వేరు గాయనీ గాయకులు పాడగా వీటిల్లో చాలా కృతులు వినిఉన్నాను ఇదివరలో. ఎందుకనో మరి ఎవరూ ఈ రాగాన్ని కచేరీలో ముఖ్యాంశంగా పాడరు. మహా ఐతే ముఖ్యాంశానికి ముందుగానో వెనుకగానో, జానెడు ఆలాపన, బెత్తెడు పాట, గుప్పెడు స్వరాలతో ముచ్చటగా ముగించేస్తారు.

మురిపెము గలిగె గదా రామ సురముని నుత కరివరద శ్రీరామ
పరమ పురుష జగదీశ వరమృదుభాష సుగుణమణి కోశ నీకు .. మురిపెము ..

ఈడు లేని మలయమారుతముచే కూడిన కావేరీతటమందు
మేడల మిద్దెలతో శృంగారము మించు సదనములలో
వేదఘోషలచే నుతియింప జూడ శివుడు కోరు యోగ్యమైన
సుందరమగు పురము దొరికెననుచు .. మురిపెము..

సకల సుగంధ రాజ సుమములు సులలితమగు కోకిల నాదములు
సుఖముగ సనకాదుల నుతమైన సూర తరువులు గలిగి
నికటమందు వాణీ కొలువ సురపతి నీలమణి నిభ శరీర నేడు
ప్రకటమైన నవరత్న ఖచిత హాటక మంటప వాసము కలిగ ననుచు.. మురిపెము ..

ఈ మహిలో సొగసైన చోళ సీమయందు వరమైన పంచనద పుర
ధాముని చెంతను వసియించుటకై నీ మది నెంచగ
కామ జనక త్యాగరాజ సన్నుత రామ పవనతనయ విధ్రుధ శరణ
క్షేమముగ వర్ధిల్లునట్టి పురమున సీతాభామ సౌమిత్రి ప్రక్క కొలిచెదరని .. మురిపెము ..


ఎప్పుడో 2002లో మదరాసు వాసంలో కొన్న కేసెట్టు. శ్రీకృష్ణగానసభ వాళ్ళు ఎప్పుడో తమ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యక్ష కచేరీలని ఇప్పుడూ కేసెట్లుగా సీడీలుగా వెలువరిస్తున్నారు .. ఇలాకూడా కొంచెం సొమ్ము చేసుకోవచ్చు అని గ్రహించినట్లు. ఇది ఎప్పుడు జరిగిన కచేరీయో తెలీదు. కాస్మిక్ మ్యూజిక్ అనే పేరిట విడుదలైంది. ఆ కచేరీలో నేదునూరి అనితరసాధ్యమైన రీతిలో అద్భుతంగా ముఖారి ఆలపించి పై త్యాగరాజ కృతిని ముఖ్యాంశంగా పాడారు. కేసెట్టుకి రెండు వైపులా విస్తరించింది. చాలా అరుదైన ఆనందకరమైన అనుభవం. మీరూ కొంచెం రుచి చూడండి.


Nedunuri Mukhari A...




Nedunuri Mukhari M...



ఇందులో లాల్గూడి జయరామన్ వయొలిన్, ఉమయాల్పురం శివరామన్ మృదంగం వాయించారు. ఆడియో క్వాలిటీ అంత గొప్పగా లేదుగానీ పరవాలేదు.

Newer Post Older Post Home